పూల్ గేమ్ లో ఓడిపోయిన వ్యక్తిని చూసి నవ్వారు... అదే వారి ప్రాణాలు తీసింది!

  • బ్రెజిల్ లో ఘటన
  • పూల్ గేమ్ ఆడేందుకు వెళ్లిన వ్యక్తి
  • రెండు గేముల్లో ఓటమి
  • తనను చూసి నవ్వారంటూ ఏడుగురి కాల్చివేత
బ్రెజిల్ లో ఘోర ఉదంతం చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయిన ఓ వ్యక్తి తనను చూసి నవ్వారన్న కారణంతో ఏడుగురిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేశాడు. మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరంలో ఈ ఘటన జరిగింది. 

ఎడ్గార్ రికార్డో డి ఒలివియేరా అనే వ్యక్తి పూల్ గేమ్ ఆడేందుకు వెళ్లాడు. బ్రెజిల్ కరెన్సీలో 4 వేల రియాల్స్ పందెం కాసి ఓ గేమ్ లో ఓడిపోయాడు. దాంతో అవమానభారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. మరలా తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఒలివియేరా తాను ఓడిపోయిన వ్యక్తితోనే మరోసారి పందెం కాశాడు. పూల్ గేమ్ లో రెండోసారి కూడా అతడికి ఓటమి తప్పలేదు. దాంతో అతడిని చూసి అక్కడున్నవారు నవ్వారు. 

రెండుసార్లు ఓటమిపాలైన ఉక్రోషంతో ఉన్న ఒలివియేరా వారి నవ్వును చూసి భరించలేకపోయాడు. తన స్నేహితుడితో కలిసి వారిని తుపాకీతో బెదిరించి వరుసగా నిలబెట్టాడు. ఆపై, ఒక్కొక్కరిని తన తుపాకీ తూటాలకు బలిచేశాడు. ఒలివియేరా కాల్పుల్లో మృతి చెందిన వారిలో పూల్ గేమ్ క్లబ్ యజమాని, 12 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్టు గుర్తించారు. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న బ్రెజిల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన ఒలివియేరా, అతడికి సహకరించిన స్నేహితుడి కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు.

Edgae Ricardo De Oliviera
Pool Game
Shot Dead
Sinop
Brazil

More Telugu News